లలితా సహస్రనామ పారాయణం
సహస్రనామాలలో ‘లలితా సహస్రం’ అతి శక్తిమంతమైనది. ఈ మంత్ర విశిష్టత ఏమిటంటే:
- వేయినామాలలో ఏ నామము కూడా మరల రాదు, ఒకటి రెండు అలా వచ్చినట్లు అనిపించుతాయి కానీ, అది పద విభజనలో తేలిపోతుంది.
- మొత్తం శ్లోకాల సంఖ్య: 182 న్నర, అంటే 365లో (సంవత్సరములో) సగం. ఏదో విశేషముంది.
- చిన్న నామాలున్నాయి, పెద్దవి కూడా ఉన్నాయి. అతి పెద్దనామాలు శ్లోకంలో ఒక పాదమంత. అతి చిన్న నామం ఒక అక్షరమే: ‘ఈ’ అని 138 వ శ్లోకంలో.
“మననాత్ త్రాయతే మంత్రం” అన్నది తెలిసినదే. మరల మరల స్మరించిన / పఠించిన కొద్దీ తరింప (దాటవేస్తుంది) చేస్తుంది మంత్రం. పరమార్థంలో తరించటము మోక్షమయితే, లౌకికంగా సంసారంలోని బాథల నుండి క్రమక్రమంగా బయట పడవేస్తుంది. అంతే కాదు, ఆనంద తీరాలకు చేరుస్తుంది.
ప్రతి సహస్రంలో వలె ఈ మంత్ర రాజంలో 1000 నామాలున్నాయి. స్తోత్రం చదివేటప్పుడు ప్రతి నామాన్ని విడివిడిగా పలకాలి. మనం లౌకిక ప్రపంచములో ఒక వ్యక్తిని పేరుతో ఎలా పిలుస్తామో, కృష్ణా, వేంకటేశా, పద్మినీ, శారదా..., అలాగేఅమ్మవారి నామాలు. సరైన పేరుతో పిలిచినపుడు ఆ వ్యక్తి స్పందిస్తాడు, లేకపోతే పట్టించుకోడు. అమ్మవారి నుంచి స్పందన లభించాలంటే ఆమె నామాలు స్పష్టంగా - తనని పిలిచినట్లు, ఉద్దేశించినట్లు - పలకాలి. స్పందన తప్పక ఉంటుంది. ఫలితం వస్తుంది మెల్లమెల్లగా.
ఈ మంత్ర రాజాన్ని అనేక గాయనిలు తమ దివ్యమైన గాత్రంతో గానం చేశారు. లక్షలాది మంది విని ఆనందిస్తున్నారుకూడా. యూట్యూబులో లక్షలలో చూస్తున్నట్లు తెలుస్తోంది. అది వినివినీ అందరికీ అలాగునే పారాయణం చేయటం సహజంగా అనిపిస్తుంది, తేలికగా అనిపిస్తుంది. అయితే రాగయుక్తంగా ఉన్న ఆ గానం ఒక శ్లోకాన్ని రెండు భాగాలుగానో, నాలుగు భాగాలు గానో పారాయణం చేయటం జరుగుతోంది. ఆ విభజన భిన్న నామాలుగా కాక, నామాలను అయుక్తంగా ముక్కలు చేయడం జరుగుతోంది, దీని వల్లన అక్కడక్కడ అమ్మవారి నామాలు ‘అపనామాలుగా’ పలుకుతాం. ఇలా పారాయణం చేయటంలో శబ్దదోషము జరుగుతుంది. శ్రద్ధగా చదివే భక్తులకు ఇలాంటి చిన్న తప్పుల వల్లన దోషమేమీ లేకున్నా, మరింత అమ్మవారి నుండి స్పందనా, అనుగ్రహం పొందటానికి నామాలు విడివిడిగా పలకాలి.
ఇదే ఈ పోస్టు యొక్క ముఖ్య ఉద్దేశ్యము.
భక్తికి భావము చాలా ముఖ్యం. భావలోపముంటే మంత్రం సారహీనమవుతుంది. యాంత్రికమవుతుంది. దుష్ఫలితాలు లేకపోయినా సత్ఫలితాలను ఇవ్వదు. శబ్దానికి, ముఖ్యంగా సంస్కృత శబ్దాలకు మనస్సునూ, బుద్ధినీ వికసింపచేసే శక్తి ఉంది. అందువల్లన అమ్మవారి నామాలు రాగధోరణిలో అపనామాలుగా చదవకుండా శ్రద్ధ తీసుకుని ప్రతి నామమూ విడివిడిగా చదివితే అమ్మ అనుగ్రహం పెరుగుతుందని నా నమ్మకము, అనుభవం.
మంత్రం యొక్క ఫలితాన్ని పొందటానికి నామాలు భావిస్తూ పఠించాలి. ఒక్కొక్కనామము విడవిడిగా పఠిస్తూంటే ఆ నామం యొక్క భావం అర్థమవుతుంది, స్థూల, సూక్ష్మ శరీరాలలోకి దివ్యశక్తి క్రమంగా చేరుతుంది. క్రమక్రమంగా ఆరోగ్యము, ప్రశాంతత అలవడతాయి. అయితే ఫలితము ఉంటుందా, ఎక్కువా, తక్కువా అనేది మనం బరువు చూసినట్లో, బిపీ చూసినట్లో, ఎత్తు కొలిచినట్లో కొలవలేము. కానీ లలిత సహస్రం చదివిన తరవాత
- కనీసం కొంచెం ప్రశాంతత వెంటనే తెలుస్తుంది
- క్రమంగా మంచి నిద్ర పడుతుంది, నిద్రలో నామాలు అసంకల్పితంగా గుర్తుకు వస్తాయి
- జ్ఞాపక శక్తి, ఏకాగ్రతా పెరుగుతాయి.
- వారాలు గడిచాక ఫలితాలు మరింత గోచరిస్తాయి. అది వ్యక్తి యొక్క శ్రద్ధ, క్రమబద్ధమైన పారాయణం పై ఉంటుంది.
నామాలలో మనకు గోచరించే అర్థాలే కాక లోతైన అర్థాలు ఉన్నాయి. డా. జి.ఎల్.ఎన్. శాస్త్రిగారు ‘శ్రీ లలితా సహస్ర నామవివిరణం’ అన్న పుస్తకంలో ప్రతి నామాన్ని సహేతుకంగా, శాస్త్రీయంగా నిర్వచించి వివరించారు. (వీరు విశాఖపట్టణ వాస్తవ్యులు ‘ది వరల్డ్ టీచర్ ట్రస్టు’ లో ముఖ్య స్థానంలో ఉండిన శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారి ప్రియశిష్యులు).
ఈ పుస్తకము ఆధారంగానే నామనిర్ణయం జరిగింది. వివరణ చదివితే అర్థం బోధపడి, భావం మరింత లోతుగా మనస్సులోకిచేరుతుంది. భక్తి ధృఢ పడుతుంది. శరణాగతి సరళమవుతుంది, జీవితము సుగమము అవుతుంది, నిశ్చింత, తృప్తిపెరుగుతాయి. ఆ పుస్తకము గూగుల్ లో డౌన్ లోడ్ చేసుకోండి. శ్రద్ధగలవారు చదువుకో గలరు.
క్రింద లంకెలో లలితా సహస్రనామము ధ్యాన, న్యాస, పంచోపచారములతో కలిపిన సహస్రనామస్తోత్రం ఇచ్చాను.
ప్రతి శ్లోకములో రెండుపాదాలు. మొదటి పాదము ‘।’, రెండవ పాదము ‘।।’ అన్న సంకేతాలతో ముగుస్తాయి. ఏ పాదములో నైనా ఒకటి కన్నా ఎక్కువ నామాలుంటే చిన్న విరామముతో, అంటే కామా (‘,’) తో ఇవ్వబడ్డాయి.
చదవాలన్నా, డౌన్ లోడ్ చెయ్యాలన్నా, ఈ లంకె నొక్కండి
Comments
Post a Comment